నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ
పరంగా ఇస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్.వి.వి.సత్యనారాయణ కోరారు. ఆయన కార్యాలయంలో
మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ
లక్ష్యాన్ని వివరించారు. రాష్ట్రంలో దాదాపు లక్ష మంది ఎస్సీ నిరుద్యోగులకు
ఉద్యోగాలు కల్పించాలన్న నిర్ణయంతో మూడు నెలల పాటు నైపుణ్యాభివృద్ధి
శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించిందన్నారు. ఐదు నుంచి పది వరకూ చదివిన
వారికి ఒక కేటగిరిగా పది, ఇంటర్ వారికి మరో కేటగిరిగా డిగ్రీ చదివిన వారికి వేరుగా
శిక్షణ ఇస్తారని తెలిపారు. మూడు కేటగిరీలుగా నిర్వహించే శిక్షణ కాలంలో
అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తారన్నారు. జిల్లాలో రమారమి నాలుగు
వేల మంది శిక్షణ పొందేందుకు అర్హులుగా గుర్తించినట్టు చెప్పారు. పద్దెనిమిది
నుంచి 35 సంవత్సరాల్లొపు వయసు ఉన్నవారు శిక్షణ కోసం ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రేషన్, ఆధార్, ఆదాయ ధ్రువీకరణలతో
పాటు విద్యార్హతలను కూడా ఆన్లైన్లో పొందుపర్చాలని తెలిపారు. శిక్షణ
పొందగోరే వారు తమకు ఆసక్తి ఉన్న రంగం, ఆశిస్తున్న జీతం తదితరాలను
కూడా దరఖాస్తులో తెలియజేయవచ్చన్నారు. శిక్షణ పొందిన వారికి ప్రభుత్వమే
ఉపాధిమార్గం చూపుతుందని స్పష్టంచేశారు. ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తులను
మీసేవా కేంద్రాల ద్వారా సమర్పించాలని, అవగాహన లేని వారు తమ కార్యాలయం
ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గతంలో వాయిదా పడిన ఎస్సీ
స్త్రీశక్తి సమ్మేళనం కార్యక్రమాన్ని ఈనెల 10న విజయవాడ లయోలా కళాశాలలో
నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం విజయవాడలోనే ఓబీఎంఎంస్పై
మండల పరిషత్తు అధికారులు, బ్యాంకర్లతో పాటు సంబంధిత అధికారులందరికి
శిక్షణ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
For latest jobs, Please download "Vijayawada TownHub" mobile app from below url https://play.google.com/store/apps/details…
or http://eventstownhub.blogspot.in/p/latest-jobs.html#
or http://eventstownhub.blogspot.in/p/latest-jobs.html#





















0 thoughts on “నైపుణ్యాభివృద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకోండి”